
కొత్త రేషన్ కార్డుల కోసం ఇకపై మీ-సేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రజలు మీ-సేవ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు.
అయితే పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి మీ-సేవ కార్యాలయాలకు ఆదేశాలు అందడం ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆదేశాలు రావడంతో సోమవారం సాయంత్రం నుంచి పౌరులకు మీ-సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. మంగళవారం ఈ కార్యక్రమం మరింత చురుగ్గా సాగింది.
రేషన్ కార్డుల కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వాళ్లు మరోసారి మీ-సేవకు వెళ్లి అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వాళ్లు మాత్రమే మీ-సేవకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రజావాణి, ప్రజాపాలన, కులగణన, మీ-సేవ.. ఇలా ఏ మాధ్యమం ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అవన్నీ సెంట్రల్ సిస్టమ్ కు వెళ్తాయని, అక్కడ్నుంచి పూర్తిస్థాయిలో పరిశీలన జరిగిన తర్వాత రేషన్ కార్డు జారీ అవుతుందని తెలిపారు అధికారులు. అర్హులు కాని వాళ్లు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారని, దాని వల్ల సమయం వృధా అవుతుందని చెబుతున్నారు.
