
నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50వేల కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ అంశంపై కలెక్టర్ ప్రశాంతితో పాటు స్థానిక ఎంపీడీవో సి.హెచ్ వెంకట రమణ, ఎమ్మార్వో అచ్యుత కుమారిలతో చర్చించానని ప్రజలెవరూ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
చనిపోయిన 10వేల కోళ్లను గొయ్యి తీసి పూడ్చి పెట్టే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారని పేర్కొన్న మంత్రి.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలను అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాని భరోసానిచ్చారు. గ్రామంలో, ఫౌల్ట్రీ సంబంధిత ప్రదేశాల్లో అధికారులు శానిటేషన్ ప్రక్రియ చేపట్టారని తెలిపారు.
కొన్నళ్ల పాటు గ్రామస్థులు చికెన్, గుడ్లు తినవద్దని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సూచించారు. కానూరు అగ్రహారం గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ఫౌల్ట్రీ నిర్వాహకులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. చనిపోయిన కోళ్లను ప్రజలకు విక్రయించవద్దని హెచ్చరించారు.
కోళ్లకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఫారాలు, ఫీడ్ స్టోరేజీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సాధ్యమన్నారు. త్వరలోనే ముందస్తు టీకాను వేసి కోళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
