Download App

ముగిసిన పోలింగ్ పర్వం… లోగుట్టు పెరుమాళ్ళ కెరుక… తమిళ ప్రజానాడి మురుగన్ కెరుక…

ఏప్రిల్ 23, 2026 By Suresh Thota
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఓటింగ్‌లో ప్రజలు పోటెత్తారు. రాత్రి 8 గంటల సమయానికి అందుతున్న సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 84 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది....
లోగుట్టు పెరుమాళ్ళ కెరుక… తమిళ ప్రజానాడి మురుగన్ కెరుక…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఓటింగ్‌లో ప్రజలు పోటెత్తారు. రాత్రి 8 గంటల సమయానికి అందుతున్న సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 84 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇంత భారీ ఎత్తున ఓటర్లు తరలిరావడం ఒక స్పష్టమైన మార్పు కోసమా లేక ఉన్న ప్రభుత్వానికి బలమైన మద్దతు తెలపడానికా అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ.

రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో 950 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. 5.73 కోట్ల మంది ఓటర్లలో రమారమి 84 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించు కోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ముఖ్యంగా 14.59 లక్షల మంది నూతన ఓటర్లు, యువత ఈసారి ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసే శక్తిగా మారినట్లు కనిపిస్తోంది. భారీ పోలింగ్ శాతం ఎప్పుడూ అధికార పక్షంలో ఒక రకమైన ఆందోళనను, ప్రతిపక్షంలో ఆశలను రేకెత్తిస్తుంది.

ఈ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పాత్ర అభినందనీయం. 75,064 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా పెద్దగా హింసాత్మక ఘటనలు జరగకుండా 3.60 లక్షల మంది సిబ్బంది, 83 వేల మంది పోలీసులు తో పకడ్బందీగా నిర్వహించారు. 300 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాల పహారాలో తమిళ ఓటరు నిర్భయంగా తన తీర్పును ఈవీఎం లలో నిక్షిప్తం చేశారు. ఒకే దశలో ఇంత భారీ పోలింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయడం గమనార్హం. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రమారమి 73 % వరకు పోలింగ్ నమోదు కాగా…. ఇప్పుడు 84% పైగా నమోదు కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

మరోవైపు, ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం గతం కంటే ఎక్కువగా కనిపించింది. ఎన్నికల సంఘం రూ. 1,262 కోట్ల విలువైన నగదు, బహుమతులను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే, క్షేత్రస్థాయిలో గెలుపు కోసం పార్టీలు ఎంతగా శ్రమించాయో అర్థమవుతోంది. అయితే, భారీ ఓటింగ్ శాతం చూస్తుంటే, ప్రజలు ప్రలోభాలకు అతీతంగా తమ సొంత అజెండాతో ఓటు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నా మధ్య హిందువుల మీద అవాకులు, చవాకులు మాట్లాడిన ఉదయనిధి వల్ల హిందూ సమాజం ఓట్లు NDA కూటమి కి మరలే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

ముగిసిన పోలింగ్ పర్వం... లోగుట్టు పెరుమాళ్ళ కెరుక… తమిళ ప్రజానాడి మురుగన్ కెరుక…

రాజకీయంగా పరిశీలించి చూస్తే, అధికార డీఎంకే నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి ఈ 84 శాతం ఓటింగ్ ఒక పరీక్షగా నిలవనుంది. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకం గానే ఉంది. ముఖ్యంగా చెన్నై మరియు డెల్టా ప్రాంతాల్లో ఓటింగ్ సరళి డీఎంకే బలాన్ని నిర్ణయించనుంది.

ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న ఏఐఏడీఎంకేకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. పశ్చిమ మరియు దక్షిణ తమిళనాడులో ఆ పార్టీకి గట్టి పట్టు ఉంది. కాని పార్టీలో నాయకుల మధ్య ఉన్న లుకలుకలు కారణంగా, ఈసారి సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆ పార్టీ ని ఎంతవరకు దెబ్బ తీస్తుంది అనేది ఆసక్తికరం గా మారింది. విజయ్ రాజకీయ ప్రవేశం వల్ల ఓట్ల చీలిక జరిగిందా లేక కొత్త ఓటు బ్యాంకు సృష్టించబడిందా అనేది ఫలితాల్లో తేలనుంది.

ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి పళణిస్వామి, ఉదయనిధి స్టాలిన్ మరియు విజయ్ వంటి దిగ్గజాలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రముఖుల గెలుపు ఓటములు రాష్ట్ర రాజకీయ దిశను మార్చబోతున్నాయి. ముఖ్యంగా విజయ్ పోటీ చేసిన పెరంబూరు, తిరుచి ఈస్ట్ స్థానాల్లో యువతలో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది.

ప్రాంతాల వారీగా విశ్లేషిస్తే, ఉత్తర తమిళనాడులో పీఎంకే, డీఎంకే మధ్య పోటీ ఉంటే, దక్షిణాన కుల సమీకరణలు, కుల సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే 84 శాతం ఓటింగ్ నమోదైందంటే, ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు వేసినట్లు భావించవచ్చు.

ఇక అందరి కళ్లు “మే 4వ తేదీ” పైనే ఉన్నాయి. ఆ రోజున వెలువడే ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి. ద్రవిడ ముద్ర కొనసాగుతుందా లేక విజయ్ వంటి కొత్త శక్తులు కింగ్ మేకర్లుగా ఎదుగుతారా అనేది ఉత్కంఠ రేపుతోంది. భారీ పోలింగ్ ఎప్పుడూ ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతం గా భావించాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

​ముగింపు:

తమిళ ఓటరు మరోసారి తన ప్రజా చైతన్యాన్ని చూపించారు. ఎండలను సైతం లెక్కచేయకుండా రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. ఇప్పుడు బంతి రాజకీయ పార్టీల కోర్టులో ఉంది. మే 4న వెలువడే తీర్పు ఏ పార్టీకి పట్టాభిషేకం చేస్తుందో, ఎవరికి ప్రతిపక్ష హోదా ఇస్తుందో వేచి చూడాలి.

“లోగుట్టు పెరుమాళ్ళు ఎరుక” అన్నట్టుగా, అరవ (తమిళ)గుట్టు మురుగన్ కెరుక”.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading