తమిళనాడు మధురాంతకంలో ప్రధాని మోదీ… తన నాయకత్వంలో NDA కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభతో, తమిళనాడులో జరగబోవు ఎన్నికలకు, 2026 జనవరి 23 తేదీన”శంఖారావం” పూరించారు. మధురాంతకంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభ రాజకీయంగా చాలా ప్రాధాన్యత ను సంతరించుకుంది.
దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలు:
NDA కూటమి బల ప్రదర్శన గా ఈ సభను భావించవచ్చు. చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, AIADMK ప్రధాన కార్యదర్శి… మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళని స్వామి ఒకే వేదికపై కనిపించారు. ఇది రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి మధ్య పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లయింది.
తమిళనాడు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ NDA ప్రభుత్వమే ఉండాలని ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ను కోరుకుంటున్నారు అని, వాళ్ళ కోరిక మేరకు 2026 ఎన్నికల్లో ఈ మార్పు తధ్యం అని ప్రధాని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా… తిరుప్పుకుండ్రం కార్తికదీపం అంశాన్ని ప్రస్తావిస్తూ, తమిళ సంస్కృతి, సంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. DMK ప్రభుత్వం… హిందూ దేవాలయాలు, భక్తుల ఆచారాల విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని, తమిళ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్తికదీపం వెలిగించడం భక్తుల హక్కు అని, అలాంటి సంప్రదాయాలను అడ్డుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. BJP మాత్రం భక్తుల విశ్వాసం, సంస్కృతిని కాపాడుతుందని, తమిళుల గౌరవం, ఆచారాల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడు బీజేపీ నేతలు ఈ సభను ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవంగా ప్రకటించారు. ఈ సభ ద్వారా అధికార DMK ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి పదును పెట్టారు. అన్నాడీఎంకే E. పళని స్వామి లతో పాటు కూటమిలోని ఇతర నేతలైన రాందాస్ (PMK), టీటీవీ దినకరన్ (AMMK), జీకే వాసన్(TMK) వంటి వారు కూడా పాల్గొని ఐక్యతను చాటారు. మొత్తానికి, ఈ సభ తమిళనాడు రాజకీయాల్లో వేడిని పెంచడమే కాకుండా, 2026 ఎన్నికల యుద్ధానికి నాంది పలికిందని చెప్పవచ్చు. ఈ సారి తమిళనాడు లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది అని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
రసవత్తరంగా తమిళ రాజకీయం. ఎప్పుడూ వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయం ఇప్పుడు సరికొత్త నాటకీయత కు సిద్ధమైంది, బీజేపీ సనాతన ధర్మం తో పాటు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఉండాలి(డబుల్ ఇంజిన్ సర్కార్)…తమిళనాడు మారాలి”… అని నినదిస్తుంటే… తమిళ సూపర్ స్టార్ TVK పార్టీ అధినేత విజయ్ “పుట్టుకతో అందరూ సమానమే, జాతి, లింగ, మత, ప్రాంత భేదాలు ఉండకూడదు” అనే నినాదం తో ముందుకు సాగుతున్నారు. DMK పార్టీ అధినేత స్టాలిన్ “స్టాలిన్ కొనసాగాలి… తమిళనాడు గెలవాలి” అనే నినాదం తో ఆయన రాజకీయ విన్యాసాలు పరి పరి విధాలుగా ఉన్నాయి. అన్నాడీఎంకే ” ప్రజల సంక్షేమం కోసం ఎంజీఆర్ మరియు అమ్మ మార్గంలో” అనే నినాదాలతో ముందుకు సాగుతున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే లు కలసి పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎంతవరకు అధికారం సిద్ధిస్తుందో చూడాలి.
మొన్నటి వరకు తమిళ రాజకీయాల్లో ఒక ఊపు తీసుకువచ్చిన తమిళనాడు బీజేపీ చీప్ అన్నామలైను పార్టీ అధ్యక్షుడుగా ఎందుకు తప్పించిందో అర్థం కాక తమిళ తంబిలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ఎన్నికల జ్వరం రాష్ట్రంలో అందర్నీ ఆవహిస్తుంది. TVK అధినేత హీరో విజయ్ పొత్తుల విషయంలో ఒక నిర్దిష్ట నిర్ణయానికి రాలేకపోతున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తమిళనాడు లో కాంగ్రెస్ గోడమీద పిల్లిలా DMK తోను, TVK తోను చర్చలు కొనసాగిస్తుంది. మిగతా చిన్న , చిన్న పార్టీలు ఏదో ఒక పార్టీ తో అంటకాగుతున్నాయి.
ఇంకో పక్షం రోజుల్లో పొత్తులు విషయంలో అన్ని పార్టీలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు… తమిళ రాజకీయ సోదరులు.