
ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
“రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు.”

ప్రభుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పవన్ కల్యాణ్. తన దగ్గరకొచ్చిన వినతులపై స్పందించడంతో పాటు.. తన శాఖలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయన జ్వరం బారిన పడ్డారు.
పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ త్వరగా కోలుకొని తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. అటు పవన్ చేయాల్సిన సినిమాలు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటి షూటింగ్స్ కూడా ఆయన పూర్తి చేయాల్సి ఉంది.
