
టాలీవుడ్ లెజెండ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు భారతీయ చిత్రసీమకు చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. పార్లమెంట్ హౌస్లో జరిగిన సమావేశంలో, ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగార్జున ప్రధాని మోదీకి “మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం” అనే పుస్తకాన్ని అందజేశారు. ఏఎన్నార్ 100వ జయంతిని పురస్కరించుకుని రచించిన ఈ పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించారు. ఈ పుస్తకం ఏఎన్ఆర్ యొక్క సినీ ప్రస్థానం, సమాజానికి అందించిన సేవలు, పరిశ్రమపై ఆయన ప్రభావాన్ని వివరిస్తుంది.
ఏఎన్ఆర్ సినీ రంగంలో 7 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. తెలుగు చిత్రసీమను తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రతిబింబించడంలో ఏఎన్ఆర్ విశేషంగా రాణించారని పేర్కొన్నారు.

చెన్నై నుంచి హైదరాబాద్కి తెలుగు చిత్రపరిశ్రమను మార్చడంలో ఆయన తీసుకున్న దృఢమైన నిర్ణయం, నేడు హైదరాబాద్ను గ్లోబల్ సినిమా హబ్గా నిలిపిందని అన్నారు ప్రధాని. ప్రధాని మోదీ “మనకి బాత్” 117వ ఎపిసోడ్లో తపన్ సిన్హా, రాజ్ కపూర్లతో పాటు ఏఎన్ఆర్కు అర్పించిన నివాళిని గుర్తు చేసుకున్నారు.
తన తండ్రి ఏఎన్ఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు హర్షం వ్యక్తం చేసిన నాగార్జున, ఆయన ప్రభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న ఏఎన్ఆర్ భారతీయ సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అమల, నాగచైతన్య, శోభిత కూడా హాజరై.. ప్రధానిని కలిశారు.
