
ఎఎస్బీసీ టన్నెల్ లో జరిగిన ఘటన విషాదాంతమైంది. వారం రోజులుగా టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఆ విషయాన్ని ఈ రోజు కొంతమంది నిపుణులు తేల్చారు.
పనులు జరుగుతున్న క్రమంలో ఊహించని విధంగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఆ టైమ్ లో సొరంగంలో 50 మంది పని చేస్తున్నారు. ఒక్కసారిగా నీరు, మట్టి, బురద మీద పడ్డంతో అంతా పరుగులుపెట్టారు. అలా 42 మంది ఘటనా స్థలం నుంచి దూరంగా పారిపోయారు.
కానీ 8 మంది మాత్రం చిక్కుకున్నారు. వీళ్లలో ఆరుగురు కార్మికులు కాగా, మిగిలిన ఇద్దరూ ఇంజినీర్లు. టెన్నెల్ బోరింగ్ మెషీన్ కు దగ్గర్లో ఉండడమే వీళ్లు చేసుకున్న పాపం. సరిగ్గా వీళ్లపైనే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.
అయినప్పటికీ వాళ్లు బతికే ఉంటారనే ఆశతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అయితే దాదాపు 500 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, ఊట నీరు సహాయ చర్యలకు తీవ్ర విఘాతం కలిగించింది.
నిమిషానికి 5వేల లీటర్ల చొప్పున ఊరుతున్న నీటిని తోడుతూ, మరోవైపు బురదను తొలిగిస్తూ లోపలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో మూడో రోజుకే ఆశలు సన్నగిల్లాయి. ఈరోజు అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి టన్నెల్ మొత్తాన్ని స్కాన్ చేసి చూడగా.. 3 మీటర్ల బురద కిందట కూరుకుపోయిన మృతదేహాల్ని గుర్తించారు. దీంతో ఆ 8 మంది మృతి చెందినట్టు అదికారులు నిర్ధారించారు. మృతదేహాల్ని వెలికితీయడానికి మరింత సమయం పట్టొచ్చు.
