
మొత్తానికి తీన్మార్ మల్లన్న తను అనుకున్నది సాధించారు. పార్టీ తనను తప్పకుండా సస్పెండ్ చేస్తుందని మెంటల్లీ ఫిక్స్ అయి మరీ కాంగ్రెస్ పై, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారుపై ఆరోపణలు చేశారు. ఇప్పుడాయన ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
కొంత కాలంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీసీ నినాదంతో అయన తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. బీసీ రాజకీయాలు చేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ రెడ్డి సామాజిక వర్గంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వ్యతిరేకత వస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ, బీఎస్పీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
