
ఈసారి తప్పకుండా జరుగుతుందని భావించిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. దాదాపు 4 నెలల కిందటే జరగాల్సిన ఈ విస్తరణ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంలో తను చేసేదేం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు.
మంత్రివర్గంలో ఎవరుండాలనేది పూర్తిగా హై-కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో తన జోక్యం లేదని సీఎం స్పష్టం చేశారు. తను ఎవ్వర్నీ రికమండ్ చేయడం లేదని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఢిల్లీ పెద్దలతో సమావేశమైన తర్వాత రేవంత్ ఈ ప్రకటన చేశారు.
మరోవైపు కులగణన, ప్రతిపక్ష నేతల అరెస్టులపై కూడా స్పందించారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతల్ని అర్జెంట్ గా అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలనే ఆలోచనలు, కోరికలు తనకు లేవని.. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని అన్నారు.
కులగణనపై వస్తున్న విమర్శల్ని ఖండించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో కులగణన సర్వేను పకడ్బందీగా చేశామని, ఇంకా ఎవరైనా నమోదుకాని వ్యక్తులు ఉంటే నమోదుకు అవకాశం కల్పించామని కూడా అన్నారు.
