
36వ సారి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈసారి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధానికి పూర్తిస్థాయిలో వివరించారు. పనిలోపనిగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు.
తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడనే లక్ష్యంగా ఈసారి రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.. ఆర్థిక చేయూత ఇవ్వకపోతే కష్టమన్నారు. కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు పెద్దగా జరగలేదనే విషయాన్ని గుర్తుచేశారు.
ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణపై ప్రధానికి పూర్తిస్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఈసారి సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు వెళ్లారు.
ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి, మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలవనున్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
