
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ, మండలి ఆమోదించాయి. దీంతో ఇకపై బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.
మొదటగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీ శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈరోజు ప్రారంభమైన తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. మొదటగా బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించి ఆమోదించారు. అనంతరం మరికొన్ని బిల్లులను కూడా సభ ఆమోదించింది.
ఇదిలావుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ఆదివారం అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చల అనంతరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో ఆందోళనకు దిగారు.
చైర్మన్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో కాళేశ్వరం కమిషన్ నివేదిక పేపర్లను చింపి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైపు విసిరేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, “రాహుల్ గాంధీకి సీబీఐ వద్దు… రేవంత్కు సీబీఐ ముద్దు” అంటూ నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద ఆందోళన చేయొద్దని, వారికి కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు. అయితే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరికి శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.
