
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమరావతి శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, సవిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ సహా కూటమి నేతలు పాల్గొన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారు. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ అమరావతిలో 58 అడుగుల ఎత్తైన ‘అమరజీవి త్యాగశిల్పం’ (Statue of Sacrifice)ను ఏర్పాటు చేశారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మాటిచ్చినట్లుగానే అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన త్యాగాన్ని తరతరాలకు గుర్తు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూటమి నేతలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గౌరవం తెలిపారు.
