
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన 655 పేజీల రిపోర్టుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
“అసెంబ్లీలో పూర్తి రిపోర్టు పెట్టండి… చీల్చి చెండాడుతాం. కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా? లేక మీరే వండి వార్చారా?” అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
“సోలో డెసిషన్ అన్నది అబద్ధం”
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఒంటరి నిర్ణయమన్న ప్రభుత్వ వాదనను ఆయన ఖండించారు. “బ్యారేజీ నిర్మాణాలు డీపీఆర్, హైపవర్ కమిటీ, కేబినెట్, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకే జరిగాయి. కేసీఆర్ వ్యక్తిగతంగా చేసిన ప్రాజెక్టు కాదు, ప్రభుత్వ నిర్ణయం ఇది,” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్-బీజేపీ కక్షసాధింపు
“కాంగ్రెస్, బీజేపీలు కలిసి కక్షసాధింపే చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాళేశ్వరం రిపోర్టు అనే డ్రామా చేస్తున్నారు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ్మిడిహట్టి అనుమతులు ఎందుకు తీసుకోలేదు? నీరు లేకపోవడం, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో మేడిగడ్డ వద్ద కట్టాం. ఏడు సంవత్సరాలు అధికారంలో ఉండి తమ్మిడిహట్టిలో తట్టెడు మట్టీ ఎందుకు తీయలేదు?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
“ధర్మమే గెలుస్తుంది”
కోర్టుల్లో నిలవలేని కేసులు వేస్తున్నారని విమర్శించిన ఆయన, “ఎన్ని కమిషన్లు వేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారు. చివరికి ధర్మమే గెలుస్తుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.
