
గతంలో ఎన్నో పనుల్ని పక్కనపెట్టింది వైసీపీ సర్కారు. చివరికి బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో కూడా అశ్రద్ధ చూపించింది. ఇది అలాంటి ఘటనే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రమణ్యం హత్యకు గురైన సంగతి తెలిసిందే.
స్వయానా ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేసి మృత్యువాత పడినప్పటికీ అతడి కుటుంబాన్ని ఆదుకోలేదు వైసీపీ. ఇప్పుడా బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. సుబ్రమణ్యం కుటుంబానికి తక్షణం పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
లాయర్ ముప్పాళ్ల సుబ్బారావు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం చొరవతో రోజుల వ్యవథిలోనే సుబ్రమణ్యం కుటుంబానికి పరిహారం అందింది. పెన్షన్ బకాయి లక్షా 20వేల రూపాయలతో పాటు.. ఎస్సీ-ఎస్టీ ఛార్జిషీటు పరిహారం కింద దాదాపు 2 లక్షల 6వేల రూపాయలు సుబ్రమణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నంకు అందించారు.
కూటమి ప్రభుత్వం వస్తే తప్ప తమకు న్యాయం జరగలేదన్నారు సుబ్రమణ్యం తల్లిదండ్రులు. తమ బిడ్డను హత్య చేసిన అనంతబాబు బెయిల్ ను తక్షణం రద్దు చేసి, అతడికి శిక్ష పడేలా చూడాలని కూటమి సర్కారును కోరారు.
