
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర స్ధానిక సంస్దల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశమయ్యారు. కార్యకర్తలెవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రాబోయేది జగన్ పాలనే అని అన్నారు.
“రాబోయేది జగన్ 2.0 పాలన. చంద్రబాబుకు ప్రతి కార్యకర్త తరపున చెబుతున్నాను, చట్టవిరుధ్ధంగా అన్యాయాలు చేస్తే వదిలిపెట్టేది లేదు. ప్రతి కార్యకర్తకు జగన్ పెద్దన్నగా తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. అన్యాయాలు చేసి గెలిచామని చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్యం గెలవాలి. ఇదే వైయస్సార్సీపీ సిద్ధాంతం. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్ధితి రావాలి.”
కూటమి ప్రభుత్వంలో వ్యవస్ధలన్నీ తిరోగమనం చెందాయని, వైయస్సార్సీపీ చెందిన ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు జగన్. చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి పథకం మోసం, అబద్ధమని.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమని అన్నారు.
లీడర్ అంటే కేడర్ కాలర్ ఎగరేసేలా ఉండాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు జగన్. చరిత్ర మార్చిన పాలన అందించామని, బడ్జెట్ తో పాటు సంక్షేమ క్యాలెండర్ అందించిన ప్రభుత్వంగా మనం గుర్తింపు తెచ్చుకున్నామని.. మరోసారి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వస్తున్నామని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో కూటమి నేతలు తిరిగే పరిస్థితి లేదన్నారు జగన్.
