
సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోసాని వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై అన్నమయ్య జిల్లా రైల్వే కోడురులో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై హైదరాబాద్ వచ్చిన పోలీసులు, పోసానిని ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కేసును పరిశీలించిన రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజులు రిమాండ్ విధించింది. త్వరలోనే పోలీసులు పోసానిపై కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు.
ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై గతంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా ఆయన కామెంట్స్ సాగాయి అప్పట్లో.
దీంతో పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2 రోజుల కిందట నమోదైన కేసుకు సంబంధించి పోసానిని అరెస్ట్ చేశారు. విచారణకు పోసాని సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.
