
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతిగా అభివర్ణించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందని.. రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు ఉండవల్లి. ఇప్పుడు డిమాండ్స్ సాధించుకోకపోతే, ఇక ఎప్పటికీ కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం ఇద్దరు విలక్షణమైన వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని, ఇద్దరికీ రెండు క్వాలిటీస్ ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉన్న మాటకారితనం, లౌక్యం ఎవ్వరికీ లేవన్నారు. అదే విధంగా ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు ఉన్న ముక్కుసూటితనం మరో నేతకు లేదన్నారు. కాబట్టి వీళ్లిద్దరూ గట్టిగా అనుకుంటే విభజన హామీల అమలు సాధ్యమని అభిప్రాయపడ్డారు.
విభజన హామీల అమలుకు సంబంధించి పవన్ కల్యాణ్ కు లేఖ కూడా రాశారు ఉండవల్లి. విభజన చట్టం ప్రకారం, 75వేల 50 కోట్ల రూపాయల మొత్తం ఆంధ్రప్రదేశ్ కు రావాలని, దీనిపై పార్లమెంట్ లో ప్రస్తావన చేయాలని కోరారు ఉండవల్లి. విభజన హామీల అమలుపై నాకు ఆశ పోయిందని, ఎందుకో ఇప్పుడు పవన్ కల్యాణ్ ను చూస్తుంటే ఆశ చిగురించిందని అన్నారు.
