
వైకుంఠపురం బ్యారేజీ.. గత ప్రభుత్వ హయాంలో మరుగున పడిన ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. రాజధాని అమరావతికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఇది. ఇప్పుడీ ప్రాజెక్టులో మళ్లీ చలనం రాబోతోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఈ ప్రాజెక్టుపై స్పందించారు.
రాజధాని అమరావతి తో పాటు, అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు నీటి అవసరాలు తీర్చేలా, తన హయాంలో చంద్రబాబు వైకుంఠపురం బ్యారేజికి శ్రీకారం చుట్టారు. 10 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యంతో, 2018 జూన్ లో 2169 కోట్లతో టెండర్లు పూర్తి చేసి, పనులు సైతం ప్రారంభించారు.
2019 ఫిబ్రవరిలో వైకుంఠపురం బ్యారేజ్ పనుల మొదలవ్వగా, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం, బ్యారేజ్ అవసరం లేదంటూ పనులు రద్దు చేసింది. అమరావతి ని విధ్వంసం చేసినట్లే, వైకుంఠపురం బ్యారేజితో పాటు రాష్ట్రంలో ఎన్నో సాగు నీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు రద్దు చేసిందని ఆరోపించారు రామానాయుడు.
కొత్త రాజధాని అమరావతి పై అక్కసుతోనే జగన్, అప్పట్లో వైకుంఠపురం బ్యారేజిని కృష్ణలో తొక్కేశారని ఆరోపించిన రామానాయుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వైకుంఠపురం బ్యారేజి నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డిపిఆర్ తయారు చేస్తున్నామన్నారు. 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా వైకుంఠ పురం బ్యారేజ్ డీపీఆర్ చేయబోతున్నారు.
