
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే దఫా వంద శాతం అధికారంలోకి వస్తామన్నారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు కేసీఆర్. ప్రజల కోసం పోరాడాలని, కాంగ్రెస్ తప్పుల్ని ప్రజలకు విడమర్చి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనల్ని, సాధించిన ఘనతల్ని కేసీఆర్ వివరించారు.
ఉద్యమమే ఊపిరిగా బీఆర్ఎస్ పుట్టిందని, ఆ ఉద్యమ స్ఫూర్తిని విడిచిపెట్టకుండా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆద్యంతం తన ప్రసంగంతో ఆకట్టుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పోరాడగలదని, తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ అని అన్నారు.
ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసని, వంద శాతం తిరిగి అధికారంలోకి వస్తామనే ఆశాభావాన్ని అధినేత వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కు వెళ్లిపోతోందని, మళ్లీ తెలంగాణను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.
