
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కూటమి ప్రభుత్వంపై ఎంత నమ్మకంపెట్టుకున్నారో అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
ఈ ఎన్నికల్లో గెలిచిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాకుండా, యువత ఆకాంక్షలను సైతం ఛిన్నాభిన్నం చేసిందని ఆరోపించిన ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో కూడిన దార్శనిక పాలనతో అన్ని పరిస్థితులనూ చక్కదిద్దుకొంటూ వస్తున్నామన్నారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో సహకారం అందిస్తున్నారని, కేంద్రం అండదండలతో- అభివృద్ధి, సంక్షేమం సమంగా చూస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం పట్టభద్రులు, మేధావులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొంటుందని మరోసారి స్పష్టం చేశారు.
త్వరలోనే జనసేన ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన పబ్లిసిటీ, ఏర్పాటు పనుల్ని నిర్మాత బన్నీ వాస్ కు అప్పగించారు.
