
కనీస మద్దతు ధర కూడా దక్కక, తీవ్రంగా నష్టపోతూ ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులకు అండగా నిలబడడం కోసం గుంటూరులోని మిర్చియార్డులో పర్యటించారు మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్. యార్డులో మిర్చి రైతులను కలిసిన ఆయన, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఒకవైపు రైతులు, మరోవైపు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో గుంటూరు మిర్చియార్డు క్రిక్కిరిసి పోయింది. అయితే ఆ స్థాయిలో మిర్చి యార్డు ప్రాంతం సందడిగా మారినా, ప్రభుత్వం కనీస భద్రత చర్యలు చేపట్టలేదని ఆరోపించారు జగన్. తన పర్యటనలో అడుగడుగునా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందని అన్నారు.

“రాష్ట్రంలో రైతుల కష్టాలను సీఎం చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదు. సచివాలయానికి, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చియార్డులో రైతులు పడుతున్న అవస్ధలు చంద్రబాబునాయుడుగారికి అర్ధం కావడం లేదు. ఆయనకు రైతుల కష్టాలు కనిపించినా కళ్లు మూసుకున్నారు. వారిని మరిన్ని కష్టాల పాల్జేస్తున్నారు. గుంటూరు మిర్చియార్డులో ఇప్పుడు మిర్చి పంటకు కనీసం రూ.10 వేలు, రూ.11 వేల ధర కూడా రావడం లేదు.”
రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు రైతులను దళారీలకు అమ్మేశారని.. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు జగన్. గ్రామాల్లో ఆర్బీకే వ్యవస్థ, ఈ–క్రాప్ విధానం నిర్వీర్యం అయిపోయాయన్నారు.
