
ఇటీవలి కాలంలో కన్నడలో తెలుగు సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. OG బ్యానెర్లు, పోస్టర్లు తొలగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో తెలుగు చిత్రాలకు అనేక అడ్డంకులు ఎదురవుతుండగా, అక్కడి ప్రభుత్వమే స్పందించకపోవడం తెలుగు సినీ పరిశ్రమలో అసంతృప్తిని కలిగించింది. ఈ నేపధ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో కాంతార: చాప్టర్ 1 టికెట్ ధరల పెంపు అనుమతించవద్దని కొందరు అభ్యర్థించారు.
ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సీనియర్ అధికారులు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కు వివరించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం జాతీయ ఐక్యత దృష్ట్యా సమస్యలను పెద్దమనసుతో పరిష్కరించాలి అని సూచించారు.
“కళ మనసులను కలపాలి గాని, విడదీయకూడదు. కర్ణాటకలో మన సినిమాలకు ఆటంకాలు కలిగిస్తున్నారని అక్కడి చిత్రాలకు ప్రోత్సాహం ఇవ్వడం ఆపొద్దు. డాక్టర్ రాజ్కుమార్ గారి రోజులనుండి ఇప్పటివరకు కన్నడ తారలకు తెలుగు ప్రేక్షకుల మద్దతు అపారంగా లభించింది. ఇరువురు ఫిలిం చాంబర్స్ కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తాను.” అని పవన్ కల్యాణ్ అధికారులతో స్పష్టం చేశారు.
ఆయన సూచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపును అధికారికంగా ఆమోదించింది.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ చిత్రం, హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్గా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది.
