
ప్రపంచ రక్షణ రంగంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఒక మహాసభ ఉంది. ప్రపంచ దేశాల సైన్యాధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ఆయుధ తయారీ సంస్థలు, రక్షణ రంగ వ్యూహాత్మక విశ్లేషకులు అందరూ ఒకే వేదికపై కలుసుకునే ఆ ప్రదర్శన శాల పేరు “యూరోసాటరీ” (Eurosatory). 2026 జూన్ 15 నుంచి 19 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలోని “విల్పింటే” ప్రదర్శన కేంద్రంలో జరుగుతున్న ఈ ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి ప్రత్యేకంగా భారతదేశం తన స్వదేశీ రక్షణ సామర్థ్యాల ను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మొదట “యూరోసాటరీ” అనే పేరే ఆసక్తికరంగా ఉంటుంది. చాలామంది ఇది ఏదైనా సైనిక సాంకేతిక పదమని భావిస్తారు. కానీ వాస్తవానికి “సాటరీ” అనేది ఫ్రాన్స్లోని వెర్సాయిల్స్ సమీప ప్రాంతం పేరు. 1967లో ఈ రక్షణ ప్రదర్శన మొదట అక్కడే ప్రారంభమైంది. తర్వాత అది యూరప్ మొత్తాన్ని ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగడంతో “యూరప్” మరియు “సాటరీ” పదాల కలయికగా “యూరోసాటరీ” అనే పేరు స్థిరపడింది.
ఈ ప్రదర్శనను భూ రక్షణ, భద్రతా వ్యవస్థలు, యుద్ధ వాహనాలు, ఆయుధాలు, నిఘా సాంకేతికతలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థల రంగంలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది సంస్థలు, వందకు పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అందుకే దీనిని కేవలం ఒక ఎగ్జిబిషన్గా కాకుండా, ప్రపంచ రక్షణ పరిశ్రమకు దిశానిర్దేశం చేసే వేదికగా భావిస్తారు.

2026లో జరుగుతున్న “యూరోసాటరీ” ప్రదర్శన చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్లలో ఒకటిగా నిలుస్తోంది. సుమారు 2,600కు పైగా సంస్థలు, 68 దేశాల ప్రదర్శనకారులు, దాదాపు 100 దేశాల అధికారిక ప్రతినిధి బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ప్రపంచ రక్షణ రంగంలో తాజా సాంకేతికతలు, భవిష్యత్తు యుద్ధ అవసరాలు, కొత్త భాగస్వామ్యాలు, కొనుగోలు ఒప్పందాలు అన్నీ ఇక్కడే చర్చకు వస్తాయి. భారతదేశం ఈ ప్రదర్శనలో తొలిసారి పాల్గొంటున్నది కాదు. గతంలో కూడా భారత సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అయితే ఈసారి పాల్గొనడంలో ఉన్న ప్రత్యేకత వేరే. గతంలో విదేశీ సాంకేతికతలను కొనుగోలు చేయడానికి వచ్చిన దేశంగా భారత్ను చూసేవారు. ఇప్పుడు స్వదేశీ సాంకేతికతలను ప్రపంచానికి విక్రయించడానికి వచ్చిన దేశంగా చూస్తున్నారు. ఇదే అసలు మార్పు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆత్మనిర్భర్ భారత్” మరియు “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాల ఫలితంగా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. ఈ నేపథ్యంలో భారత రక్షణరంగ పరిశ్రమ తన సామర్థ్యాలను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయడానికి “యూరోసాటరీ” వంటి వేదికలను సమర్థంగా వినియోగించుకుంటోంది.
ఈసారి భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. నిఘా వ్యవస్థలు, రక్షణ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సాంకేతికతలు, యుద్ధ వాహనాల భాగాలు, సైనిక రక్షణ పరికరాలు, ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణమైన పరిష్కారాలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. భారతీయ సంస్థలు కేవలం దేశీయ అవసరాలకే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను కూడా తీర్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయని ఈ ప్రదర్శన ద్వారా తన సత్తా చూపించే ప్రయత్నం జరుగుతోంది.

అసలు “యూరోసాటరీ” వంటి ప్రదర్శనల ప్రధాన ఉద్దేశం మార్కెటింగ్. ఒక కొత్త కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు కంపెనీ దానిని ప్రదర్శించినట్లే, రక్షణ సంస్థలు తమ ఆయుధాలు, వ్యవస్థలు, సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. అయితే ఇక్కడ కొనుగోలుదారులు సాధారణ ప్రజలు కాదు. పలుదేశాల ప్రభుత్వాలు, సైన్యాలు, భద్రతా సంస్థలు కొనుగోలు దారులుగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ జరిగే చర్చలు భవిష్యత్తులో బిలియన్ల డాలర్ల ఒప్పందాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. రక్షణ రంగంలో ఎగుమతులు పెరగడం కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కాదు. అది ఒక దేశ సాంకేతిక సామర్థ్యానికి గుర్తింపు. ఒక దేశం తయారు చేసిన ఆయుధాలను ఇతర దేశాలు కొనుగోలు చేస్తున్నాయంటే ఆ దేశంపై, ఆ దేశ తయారీ పై, నాణ్యత పై, వారికి అమితమైన విశ్వాసం ఉందని అర్థం. అందుకే రక్షణ ఎగుమతులు వ్యూహాత్మక ప్రభావాన్ని కూడా పెంచుతాయి.
ఒకప్పుడు భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులలో ఒకటిగా ఉండేది. యుద్ధ విమానాల నుంచి తుపాకుల వరకు అనేక వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడేది. అయితే గత దశాబ్దంలో పరిస్థితి క్రమంగా మారింది. స్వదేశీ పరిశోధన, తయారీ సామర్థ్యాలు పెరగడంతో భారత్ ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. “యూరోసాటరీ 2026” లో భారత పాల్గొనడం కేవలం ఒక ప్రదర్శనలో హాజరు కావడం కాదు. ఇది భారత రక్షణ పరిశ్రమలో జరుగుతున్న మార్పుకు ప్రతీక. “కొనుగోలు చేసే దేశం” నుంచి “తయారు చేసి అమ్మే దేశం”గా మారాలనే భారత లక్ష్యానికి ఇది ఒక ప్రతిబింబం. ప్రపంచ రక్షణ రంగంలో భారత్ తన ముద్ర వేయాలంటే ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై నిరంతర ఉనికి అవసరం.
అందువల్ల “యూరోసాటరీ 2026″ను కేవలం ఫ్రాన్స్లో జరుగుతున్న ఒక రక్షణ ప్రదర్శనగా చూడలేం. ఇది ప్రపంచ రక్షణ వ్యాపారానికి కేంద్రబిందువు. అదే సమయంలో భారతదేశం తన సాంకేతిక శక్తిని, పారిశ్రామిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక ముఖ్యమైన వేదిక కూడా. ఈ ప్రదర్శనలో భారత ఉనికి, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ రక్షణ మార్కెట్లో భారత్ పోషించబోయే పాత్రకు ఒక సూచికగా నిలవడం ఖాయం.
