
విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. వివిధ రంగాల నుండి దాదాపు 6 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొని భారీ స్పందన ఇచ్చారు.
ఈ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో మొత్తం 613 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా, ఈ ప్రాజెక్టులు అమల్లోకి వచ్చిన తర్వాత 16 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కలుగనున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ పాలనపై స్పందించారు. “2019–24 కాలం పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి ఒక ‘బ్యాడ్ పీరియడ్’. కొత్త పెట్టుబడులు రాకపోవడమే కాకుండా, ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కూడా తరిమేశారు. పెట్టుబడిదారులను బెదిరించిన ఉదాహరణకు సోలార్ పీపీఏల వ్యవహారం ఒక కేస్ స్టడీ. ఆ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి దాదాపు రూ. 9 వేల కోట్ల నష్టం జరిగింది” అని ఆయన పేర్కొన్నారు.

కొత్త ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారదర్శక విధానాలు, పరిశ్రమలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టడంతో విశాఖ సదస్సులో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సానుకూల సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
