
ఆధునిక ప్రపంచంలో “వ్యర్థాల నిర్వహణ” (Waste Management) అనేది ఒక పెను సవాలు గా మారింది. ఒక్కో దేశం ఒక్కో తీరుగా ఎదుర్కొంటుంది. కొన్ని దేశాలు ఈ వ్యర్థాల ద్వారా సంపద సృష్టిస్తున్నాయి. అటువంటి సవాళ్లు అధిగమిస్తూ భారత దేశం కూడా సంపదను సృష్టించబోతున్నది. అటువంటి వ్యర్థాల సమస్యను రాష్ట్ర ప్రగతికి ఇంధనంగా, సరికొత్త సంపదగా మార్చవచ్చని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్”. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పరిశీలనలు, అంతర్జాతీయ అధ్యయనాలు, నిపుణుల సూచనలతో ఏపీని “డంపింగ్ యార్డులు లేని రాష్ట్రం”గా తీర్చిదిద్దేందుకు ఆయన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే పల్నాడు జిల్లా కొండవీడులోని “జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్”ను ఆయన స్వయంగా సందర్శించారు. అక్కడ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి, ప్రతిది క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అధికారులతో జరిపిన సమీక్ష తో ఆయనకు, పర్యావరణ పరిరక్షణపై ఉన్న నిబద్ధత, దూరదృష్టి ఆయనలోని పర్యావరణ హితత్వాన్ని ఆవిష్కరింపజేసింది.
వ్యర్థం కాదు.. విద్యుత్ సంపద….
రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. దీన్ని ఒక శాపంగా కాకుండా, ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మార్చాలన్నది ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ఆలోచన. కొండవీడు “జిందాల్ ప్లాంట్” రోజుకు 1,400 టన్నుల చెత్తను ప్రాసెస్ చేస్తూ 20 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్కు అందిస్తున్న విధానాన్ని ఆయన క్షుణ్నంగా పరిశీలించారు. బూడిదను సైతం ఇటుకల తయారీకి వాడే సాంకేతికతను చూసి, వ్యర్థాల తో “జీరో వేస్ట్” (Zero Waste) సాధించవచ్చు అన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్తరాంధ్రలో విశాఖ ప్లాంట్ (15 మెగావాట్లు) విజయవంతం కాగా.. త్వరలోనే కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో మరో 6 “వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల”ను తీసుకురావడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం తో, ఏపీ ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకడమే అవుతుంది.
ఉప ముఖ్యమంత్రి ”పవన్ కళ్యాణ్” నాయకత్వ శైలిలో ప్రత్యేకత ఏంటంటే.. సమస్యను గుర్తించడమే కాదు, దానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉత్తమ పరిష్కారాలు ఉంటే వాటిని మన రాష్ట్రానికి తీసుకువచ్చేవరకు, దానిని ఫాలో కావడం ఆయనలోని గొప్ప లక్షణం. “సింగపూర్” తన చెత్తలో 90 శాతాన్ని కాల్చి, దేశ ఇంధన అవసరాల్లో 2.8 శాతం విద్యుత్ను దాని నుంచే సాధిస్తోంది. అక్కడ “టాంజాంగ్ టెర్మినల్” లో చెత్తను వేరు చేసే పద్ధతిని విశాఖ పోర్టులోనూ అమలు చేయాలనే ఆలోచన “పవన్ కళ్యాణ్” యొక్క శైలికి నిదర్శనం. దేశంలోనే స్వచ్ఛభారత్ అవార్డుల్లో అగ్రగామిగా నిలిచే “ఇండోర్ మోడల్” తరహాలో ఏపీలోని నగరాలు, గ్రామాల్లో చెత్త సేకరణ పారదర్శకంగా జరగాలని, దానికి తగిన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

కాలుష్య రహితంగా… ‘గోదావరి పుష్కరాలు’
రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కాలుష్యరహితంగా నిర్వహించాలనేది పవన్ కళ్యాణ్ తిరుగులేని సంకల్పం. పవిత్ర “గోదావరి” నదిలోకి ఎలాంటి వ్యర్థాలు చేరకుండా అడ్డుకట్ట వేయడానికి ఆయన పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. పుష్కరాలతో ముడిపడి ఉన్న 268 గ్రామ పంచాయతీలను ఇందులో భాగస్వామ్యం చేస్తూ, పంచాయతీ అధికారులకు ప్రత్యేక శిక్షణ మరియు వర్క్ షాపులు నిర్వహించాలని నిర్ణయించడం ఒక అద్భుతమైన అడుగు. నదీ పరివాహక ప్రాంతాలను అందంగా, స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను ఆయన స్వయంగా భుజానకెత్తుకున్నారు.
గ్రామీణ వికాసం – ఉపాధి అవకాశాలు…
ఉప ముఖ్యమంత్రి ”పవన్ కళ్యాణ్” విజన్ కేవలం పర్యావరణానికే పరిమితం కాలేదు, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోనూ ముడిపడి ఉంది. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల మున్సిపాలిటీలు, గ్రామాల్లోని చెత్తను సులభంగా తరలించవచ్చు. రూ.25 కోట్ల అంచనాతో నిర్మితమయ్యే ప్రతి మెగావాట్ సామర్థ్యం గల ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, “బయో మిథలైజేషన్” ప్లాంట్ల ద్వారా పూలు, కూరగాయల వ్యర్థాల నుండి బయో గ్యాస్ ఉత్పత్తి చేసి పంచాయతీలకు అదనపు ఆదాయం పొందే మార్గాలను పెంపొందించడానికి ఆయన అన్వేషణ కొనసాగుతుంది.
ముగింపు: చెత్తను వేరు చేయడం, దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడంపై ప్రజల్లో చైతన్యం రావాలి” అని “పవన్ కళ్యాణ్” పిలుపునిస్తున్నారు. ఇది ఒక ప్రభుత్వ ఆర్డర్ కాదు, ఇదొక సామాజిక బాధ్యత. ప్రజల భాగస్వామ్యంతో, అత్యాధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛమైన, ప్రగతిశీల రాష్ట్రంగా మార్చడానికి జనసేనాని చూపిస్తున్న ఈ బాట.. భవిష్యత్తు తరాలకు పచ్చని పర్యావరణాన్ని కానుకగా ఇవ్వబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాయకుడంటే కేవలం అధికారం చలాయించేవాడు కాదు.. సమాజ హితం కోసం నిరంతరం ఆలోచించేవాడని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపిస్తున్నారు.
