
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం వేడెక్కింది. ఈ నేపధ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తరఫున న్యాయవాదులు కేంద్ర మంత్రి బండి సంజయ్కు లీగల్ నోటీసు జారీ చేశారు.
ఈనెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో, కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి, దురుద్దేశపూర్వకమైనవి అని నోటీసులో పేర్కొన్నారు. ఒక కేంద్రమంత్రిగా, బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ మరొక ప్రజాప్రతినిధిపై అసత్యపూర్వక వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా తప్పు అని న్యాయవాదులు స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే…
కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు, ప్రజలలో కేటీఆర్ ప్రతిష్టను దిగజార్చడమే ఉద్దేశ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసులో ఆరోపించారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకుండా పదేపదే అసత్య వ్యాఖ్యలు చేయడం ద్వారా కేటీఆర్ మరియు ఆయన కుటుంబంపై నేరుగా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆరోపణ
నోటీసులో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ, అనంతరం మంత్రిగా కూడా కేటీఆర్ అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించారని, అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాయని పేర్కొన్నారు.
న్యాయవాదులు బండి సంజయ్కు నోటీసులో రెండు ప్రధాన డిమాండ్లు ఉంచారు:
- కేటీఆర్కు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- భవిష్యత్తులో కేటీఆర్ లేదా ఆయన కుటుంబంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి అసత్య, దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి.
ఈ డిమాండ్లను ఏడు రోజులలోపు పాటించకపోతే, చట్టపరంగా సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వల్ల కలిగిన ప్రతిష్టనష్టం, మానసిక ఇబ్బందులకు బండి సంజయ్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నోటీసులో స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల్లో ఈ లీగల్ నోటీసు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక, బండి సంజయ్ ఈ నోటీసుకు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి .
