
రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 5 కోట్ల మంది ప్రజలూ ‘నా రాజధాని అమరావతి’ అని గర్వంగా చెప్పుకొనేలా నిర్మిస్తామని వెల్లడించారు.
కొత్త రాజధానిని ప్రారంభించేందుకు మూడేళ్ల తర్వాత మళ్లీ మీరే రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ‘గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజాతీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంది.

గత 10 నెలల్లో సవాళ్లు అధిగమించాం. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో.. అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. ఈ ఒక్కరోజే రూ.49 వేల కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం’ అని పేర్కొన్నారు.
అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. ‘గతంలో ప్రధాని నరేంద్ర మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభమవుతున్నాయి. ఐదేళ్ల పాటు సాగిన విధ్వంసాన్ని దాటుకుని మళ్లీ రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామంటే ఇంతకంటే మంచి రోజు ఉండదు. రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇది’ అని వ్యాఖ్యానించారు.
