
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను ఆయన సందర్శించి, అధికారుల పనితీరును పరిశీలించారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం స్వయంగా అందజేశారు.
తదనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆ చట్టం ద్వారా ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొంతమంది వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగిందని, అంతేకాకుండా ఆ నిర్ణయాలపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేయాలని ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.

ఇదే నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో జరిగిన సభలో పట్టాదారు పాస్ పుస్తకాన్ని కాల్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ కుంభకోణాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జే-బ్రాండ్స్ పేరిట కల్తీ మద్యం వల్ల సుమారు 30 వేల మంది మరణించారని ఆయన అన్నారు. పేదల ఆరోగ్యంకంటే డబ్బులే వారికి ముఖ్యమని విమర్శించారు. అలాగే తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
