
భారత రక్షణ రంగంలో అత్యున్నత పదవి అయిన “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్” (CDS) గా జనరల్ ఎన్. ఎస్. రాజా సుబ్రమణి (General N.S. Raja Subramani) బాధ్యతలు స్వీకరించారు. దేశానికి మూడవ సిడిఎస్(CDS)గా ఆయన రక్షణ దళాల అధికార పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ పదవీ విరమణ చేయడంతో, కేంద్ర ప్రభుత్వం రాజా సుబ్రమణి ని నూతన సిడిఎస్ గా నియమించింది.
అంతర్జాతీయం గా యుద్ధాలు, దేశ సరిహద్దు దేశాలు బంగ్లాదేశ్ , పాకిస్తాన్ లకు చెందిన అరాచక శక్తులు నిత్యం విసిరే సవాళ్లు, త్రివిధ దళాల సమన్వయం ఇవి నూతన సిడిఎస్ జనరల్ రాజా సుబ్రమణి ముందున్న లక్ష్యాలు. సరిహద్దుల్లో భౌగోళిక రాజకీయాలు శరవేగంగా మారుతున్న వేళ, అంతర్జాతీయంగా యుద్ధ తంత్రాల సమీకరణాలు మారుతున్న తరుణంలో… భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన “చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్” (CDS) పగ్గాలను జనరల్ ఎన్. ఎస్. రాజా సుబ్రమణి చేపట్టారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీ విరమణ అనంతరం దేశపు మూడవ సిడిఎస్గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఇది కేవలం ఒక ఉన్నత పదవి భర్తీ లాంటిది కాదు, ద్విముఖ సరిహద్దు సవాళ్లను (Two-Front Challenges) ఎదుర్కొంటున్న భారతదేశ రక్షణ వ్యూహాన్ని మరింత పదును పెట్టే ఒక వ్యూహాత్మక అడుగు.
ఎందుకు ఈయన నియామకం జరిగింది:
ప్రస్తుత తరుణంలో భారతదేశానికి పశ్చిమాన పాకిస్తాన్ నుండి వచ్చే సాంప్రదాయ, ఉగ్రవాద ముప్పు ఎంత ఉందో… ఉత్తరాన చైనా నుండి వస్తున్న వ్యూహాత్మక, సరిహద్దు ఆక్రమణ సవాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సరిహద్దుల నైసర్గిక స్వరూపంపై, శత్రువుల యుద్ధ తంత్రాలపై పూర్తి పట్టున్న కమాండర్ దేశానికి అవసరం.
జనరల్ NS రాజా సుబ్రమణి నాలుగు దశాబ్దాల సైనిక ప్రస్థానం పరిశీలిస్తే, ఈయనకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారో స్పష్టమవుతుంది. ఈయనకు పశ్చిమ సరిహద్దులో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించగల, మెరుపు దాడులకు పేరొందిన అత్యంత కీలకమైన “ఖర్గా స్ట్రైక్ కోర్” (II Corps) కు కమాండర్గా పనిచేసిన అనుభవం ఉంది.
మరో వైపు, చైనా సరిహద్దు వెంబడి ఉండే అత్యంత సున్నితమైన పర్వత ప్రాంత రక్షణ విభాగం లో, ముఖ్యంగా “17 మౌంటైన్ డివిజన్” మరియు నార్తర్న్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా లడఖ్, వాస్తవాధీన రేఖ (LAC) వ్యవహారాలను ఈయన క్షుణ్ణంగా పర్యవేక్షించారు. అటు పశ్చిమ మైదాన ప్రాంత యుద్ధ వ్యూహాలు (Plain Warfare), ఇటు ఉత్తర పర్వత ప్రాంత యుద్ధ తంత్రాలు (Mountain Warfare) రెండింటిలోనూ సమానమైన పట్టుండటం ఈయనకు ఉన్న అతిపెద్ద సానుకూలాంశం.
ఒక ఉత్తమ సైనికాధికారికి క్షేత్రస్థాయి అనుభవంతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన కూడా అవసరం. జనరల్ NS రాజా సుబ్రమణి కేవలం యుద్ధ రంగంలోనే కాదు, విద్యా రంగంలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని జాయింట్ సర్వీసెస్ కమాండ్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ, లండన్లోని కింగ్స్ కాలేజీ నుండి మాస్టర్స్ డిగ్రీ, మద్రాస్ యూనివర్సిటీ నుండి డిఫెన్స్ స్టడీస్లో ఎం.ఫిల్ పట్టా అందుకున్నారు. కజకిస్తాన్లో భారత రక్షణ ప్రతినిధిగా (Defence Attaché) పనిచేసిన అనుభవమే కాక, అంతర్జాతీయ రక్షణ దౌత్యాన్ని నడపడంలో ఆయన వ్యూహాత్మక ఆలోచనా సరళి ప్రత్యేకం.
జనరల్ NS రాజా సుబ్రమణి భుజాలపై ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అనేక గురుతర బాధ్యతలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి….. థియేటర్ కమాండ్ల ఏర్పాటు (Theater Commands) ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్… ఈ మూడు విడి విడి విభాగాలుగా కాకుండా, సంయుక్తంగా ఒకే కమాండ్ కింద పనిచేసేలా చేసే “థియేటరైజేషన్” ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంటోంది. దీనిని వేగవంతం చేసి, మూడు దళాల మధ్య సంపూర్ణ సమన్వయాన్ని (Jointness) తీసుకురావడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్.
రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారం తగ్గించి, స్వదేశీ సాంకేతికతను పెంచడం (Indigenization), కొత్త తరం డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను భారత సైన్యంలోకి వేగంగా చొప్పించాల్సి ఉంది.
ఇటీవలి వరకు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (NSCS) లో మిలిటరీ అడ్వైజర్గా పనిచేసిన అనుభవంతో, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా దీర్ఘకాలిక భద్రతా వ్యూహాలను రూపొందించడం ఇప్పుడు అత్యవసరం.
ముగింపు: దేశ రక్షణలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గానూ లభించిన పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) వంటి పురస్కారాలు ఆయన అంకితభావానికి సాక్ష్యాలు. “యుద్ధ తంత్రం కేవలం ఆయుధ బలం మీద మాత్రమే కాదు… ఆయుధాన్ని నడిపించే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది.” ప్రస్తుత సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల్లో, అపార అనుభవజ్ఞుడైన, CDS జనరల్ NS రాజా సుబ్రమణి సారథ్యంలో భారత త్రివిధ దళాలు మరింత శక్తివంతంగా, ఆధునికంగా రూపాంతరం చెందుతాయని ఆశిద్దాం.
