
అవమానం పదును పెట్టినట్టుగా మనిషిని ఇంకొక విషయం ఏది పదును పెట్టదు. అలా కాంగ్రెస్ లో జరిగిన అవమానం నుండి, జవాబు గా అస్సాం లో బీజేపీ ని విజయతీరాలకు నడిపించిన విజయుడే “హేమంత బిశ్వా శర్మ”… అస్సాం ఒక్కటే కాదు, తన దైన శైలి లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ నీ, బలమైన వ్యవస్థ గా తీర్చిదిద్దారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో “హిమంత బిశ్వ శర్మ” నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి, వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం. 126 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ను అధిగమించి హ్యాట్రిక్ నమోదు చేయడం, రాష్ట్రంలో బీజేపీకి ఉన్న పట్టును మరోసారి నిరూపించింది. 82 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీ అవతరించింది. మిత్ర పక్షాలతో కలిపి 100 పైగా సీట్లు సాధించి విజయ తీరాల కు జేర్చారు.
ఈ అద్భుత విజయానికి ప్రధాన సూత్రధారి “అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ”. ఆయన తన అసాధారణ రాజకీయ చాణక్యంతో అస్సామీ అస్తిత్వాన్ని, హిందూత్వ భావజాలాన్ని సమర్థవంతంగా మేళవించి, రాష్ట్రంలోని వివిధ వర్గాలను ఏకం చేయడంలో సఫలీకృతులయ్యారు. ప్రజలు ఆయనను కుటుంబ సభ్యుడిగా భావిస్తూ “అస్సాం మామ” అని పిలుచుకునే స్థాయికి చేరుకోవడం, ఆయన లోని కలుపుగోరుతనం నకు , ప్రజల్లో ఉన్న ప్రజాదరణకు నిదర్శనం.
ప్రభుత్వ పనితీరులో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన రోడ్ల నిర్మాణం మరియు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అభివృద్ధి ఎజెండా సామాన్యుడికి చేరువ కావడంలో ప్రభుత్వ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది . ముఖ్యంగా ‘అరుణోదయ’ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్ల మనసును గెలుచుకున్నాయి. సుమారు 40 లక్షలకు పైగా కుటుంబాలకు నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక సాయం అందజేయడం, మరియు సామాజిక సంస్కరణల విషయానికి వస్తే, బాల్య వివాహాల నివారణకు తీసుకున్న కఠిన చర్యలు, బహు భార్యత్వం వంటి అంశాలపై ప్రభుత్వం చూపిన చొరవ తో మెజారిటీ ప్రజల మనసు గెలుచుకున్నారు.
అదే సమయంలో, బంగ్లాదేశ్ మూలాలున్న చొరబాటుదారుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన వైఖరి జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని భావించి ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారు. స్థానిక సంస్కృతి మరియు అస్తిత్వాన్ని కాపాడతామనే హామీ ఓటర్లలో నమ్మకాన్ని పెంచింది. ప్రతిపక్షాల వైఫల్యం కూడా బీజేపీ గెలుపుకు ఒక ప్రధాన కారణంగా నిలిచింది. కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య ఐక్యత లోపించడం, క్షేత్రస్థాయిలో సరైన ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయాయి. “గౌరవ్ గొగోయ్” వంటి అగ్రనేతల ఓటమి వారి బలహీనతను స్పష్టం చేసింది.
బీజేపీకి ఉన్న పటిష్టమైన సంస్థాగత నిర్మాణం మరో బలమైన పునాది. ఎన్నికలకు చాలా ముందు నుంచే నియోజకవర్గాల వారీగా వ్యూహాలను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం వంటివి అదనపు బలం చేకూర్చాయి. యువత మరియు మహిళల భాగస్వామ్యం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. యువతను సోషల్ మీడియా మరియు రోడ్ షోల ద్వారా ఆకట్టుకోవడంలో, మహిళలను సంక్షేమ పథకాల ద్వారా ప్రభావితం చేయడంలో పార్టీ నాయకత్వం సఫలీకృతమైంది.
మొత్తంగా, అభివృద్ధి, జాతీయ భద్రత, స్థానిక అస్తిత్వం మరియు పటిష్టమైన రాజకీయ వ్యూహాల కలయికతో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అస్సాంలో జైత్రయాత్రను కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించే బాధ్యతను మరోసారి అందుకున్నది.
ముగింపు: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక నాయకుడ్ని అంచనా వేయడంలో పొరబడితే… ఎలా ఉంటుందో హేమంత బిశ్వా శర్మ విషయంలో బాగా అర్థం అయినట్టుంది. కాంగ్రెస్ కు, అందుకే తొందరపడి ఇప్పుడు నాయకులను చెందనాడుకోవడం లేదు. ఎవరికి ప్రజాదరణ ఉందో చూసుకుంటుంది.
