
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేసు వేడెక్కుతోంది. ఈసారి రాజకీయంగా భారీ దుమారం రేపే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా మాల సంఘం ప్రకటించిన తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తమ వర్గానికి అన్యాయం జరుగుతోందన్న ఆగ్రహంతో మాల జేఏసీ పెద్ద ఎత్తున బరిలోకి దిగుతోంది.
తమను, తమ వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించిన మాల జేఏసీ నాయకులు — చైర్మన్ మందాల భాస్కర్, ప్రెసిడెంట్ చెరుకు రామ్ చందర్ — సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాల సామాజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన 200 మంది యువ ప్రతినిధులను బరిలోకి దింపనున్నట్టు ప్రకటించారు.
“ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తులు చేసాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణ పేరుతో 58 ఉపకులాలకు తీరని అన్యాయం జరిగింది. ఎంపెరికల్ డేటా సేకరించి, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు — కానీ అవేవీ చేయకుండా, కొన్ని కులాల గొంతుకలను కోశారు” అని మాల జేఏసీ నాయకులు మండిపడ్డారు.
తమ సమాజానికి జరిగిన అన్యాయం పట్ల ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం చెబుతామని, ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. “ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు.
సోమవారం ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియతో పాటు మాల సంఘం పెద్ద ఎత్తున బరిలోకి రావడంతో, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మలుపు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
