
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, ప్రాజెక్టు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని వివరించారు.
“రూ. 38,500 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన ప్రాజెక్టు, ఇప్పుడు లక్షా పది వేల కోట్లకు పెరిగింది. డిజైనింగ్ నుండి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు ప్రతి దశలో అవకతవకలు జరిగాయని ఘోష్ కమిషన్ నిగ్గుతేల్చింది,” అని మంత్రి తెలిపారు.

స్థలం మార్పుతో రూ. 6 వేల కోట్ల నష్టం
ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్లే రూ. 6 వేల కోట్లు వృథా అయ్యాయని ఆయన పేర్కొన్నారు. “ఇది తెలంగాణ ప్రజల డబ్బుతో చేసిన అతిపెద్ద దోపిడి. దీనికి బాధ్యులు తప్పించుకోలేరు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టు కేవలం అవినీతి కోసం వేదికగా మారిందని ఆరోపించిన మంత్రి, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బహిర్గతం చేస్తామని వెల్లడించారు.
