
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ సవాల్ విసురుతూ, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“నేను రాజీనామా చేయను. కిషన్ రెడ్డి ముందుగా చేస్తేనే నేను కూడా చేస్తాను. ఇద్దరం కలసి స్వతంత్రులుగా పోటీ చేస్తే ఎవరి బలం ఎక్కువో తెలుస్తుంది” అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రబ్బర్ స్టాంప్గా మారారని విమర్శించిన రాజాసింగ్, ప్రస్తుత కమిటీతో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం అని తేల్చిచెప్పారు. “ఆ కమిటీతో అధికారంలోకి వస్తే నేనే రాజకీయ సన్యాసం తీసుకుంటా” అని అన్నారు.
గత మూడు ఎన్నికల్లోనూ గోషామహల్ ప్రజలే తనను గెలిపించారని, బీజేపీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని ఆయన ఆరోపించారు. “పార్టీని బలహీనపరిచేది ఎవరో నేను మరోసారి చెబుతా. ఢిల్లీ పెద్దలతో నాకు సంబంధాలు ఉన్నాయి. వారి ఆశీర్వాదం ఎప్పటికీ నాపై ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదు” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
